Wednesday, April 27, 2011

జర్మనీ * జీవన విధానం - డాక్టర్ మధురవాణి

"పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసినప్పుడు నాకు ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు పెట్టి ఇక్కడి యూనివర్సిటీ ప్రమాణాలకు సరిపోతానో లేదో పరీక్షించారు. దానికి నాక్కొంచెం కోపం వచ్చింది. ఇండియాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అరుదుగా వచ్చే డిస్టింక్షన్ సంపాదించిన నా డిగ్రీని సరిపోదంటారా - అన్న భావన వచ్చింది.
E-Pao! Photo Gallery
Munich University
కానీ ప్రపంచంలో 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ యూనివర్సిటీ పేరుండటం చూశాక నాకు అర్థమయింది - ఆ హోదాను, నాణ్యతను నిలుపుకోవడానికి వీరు తీసుకునే జాగ్రత్త అది అని...'' అంటున్నారు జర్మనీలో గడచిన ఆరేళ్లుగా ఉంటున్న డాక్టర్ మధురవాణి. మ్యూనిక్ నగరంలో పోస్ట్‌డాక్టరల్ సైంటిస్టుగా పరిశోధన చేస్తున్న ఈ యువతి ఆ దేశం గురించి బోలెడు ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు. అవి ఆమె మాటల్లోనే...
"నేను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చదివాను. అక్కడ మా ప్రొఫెసర్లలో చాలామంది జర్మనీలోని వివిధ యూనివర్సిటీల్లో పరిశోధన చేసినప్పటి అనుభవాలను అప్పుడప్పుడూ చెబుతుండేవారు.

మా పీజీ ఆఖరి రోజుల్లో జర్మనీ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఇండియాలో పర్యటించింది. వారి ద్వారా జర్మనీలోని పరిశోధనా అవకాశాలు, ప్రమాణాల గురించి మాకు వివరంగా తెలిసింది. ఆ స్ఫూర్తితోనే నేను ఇక్కడ పీహెచ్‌డీకి దరఖాస్తు పెట్టుకున్నాను. నేను వచ్చేప్పటికి చేయబోయే పరిశోధన గురించి తప్పితే జర్మనీ జీవన విధానం గురించి నాకు అస్సలు అవగాహన లేదు. ఇక్కడికొచ్చాకే అవన్నీ తెలుసుకున్నాను.

భాషన్నా...యాసన్నా ప్రాణం...

జర్మన్లకు వారి భాషంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీనూ! మనం స్కూల్ వరకూ తెలుగు చదువుకున్నట్టు వీరు ఇంగ్లిష్, ఫ్రెంచి లాంటి భాషలు చదువుకుంటారంతే. ఉన్నత విద్య సైతం మాతృభాషలోనే అభ్యసిస్తారు. ఉదాహరణకు పీహెచ్‌డీ థీసిస్ కూడా వాళ్ల భాషలోనే రాసుకోవచ్చు. పబ్లిక్ స్థలాల్లో ప్రతీదీ జర్మన్ భాషలోనే రాసుంటుంది. ఇంగ్లీష్ వచ్చినా సరే సాధారణంగా మాట్లాడరు. తప్పని పరిస్థితిలోనే వారి నోటి వెంట ఇంగ్లీష్ వస్తుంది. ప్రత్యేకంగా మేముంటున్న బవేరియా ప్రాంతం వాళ్లకి వారి సంస్కృతి అన్నా, మిగతా జర్మనీ వారి కన్నా వైవిధ్యంగా ఉండే వారి యాసన్నా అమితమైన అభిమానం.

మాటలు తక్కువ...క్రమశిక్షణ ఎక్కువ

జర్మన్లు క్రమశిక్షణకి, సమయపాలనకి పెట్టింది పేరు. బస్‌గాని, రైలుగాని ఏడు ముప్పై ఒకటికి వస్తున్నట్టు షెడ్యూల్ ఉంటే సరిగ్గా ఏడు ముప్ఫై ఒక్క నిమిషంలోనే అది అక్కడ ఉంటుంది. మనుషులు రిజర్వ్‌డ్‌గా ఉంటారనిపిస్తుంది. అపరిచితులు ఎదురుపడితే కొద్దిగా నవ్వుమొహంతో హలో చెప్తారు. బస్సుల్లో రైళ్లలో అస్సలు మాటలు వినపడవు. వినిపించినా చాలా తక్కువ. అందరూ పుస్తకంలోనో, పత్రికల్లోనో తలదూర్చి ఉంటారు. యువత చెవుల్లోనైతే ఐపాడ్, లేదంటే చేతిలో వీడియోగేమ్స్‌తో కనిపిస్తారు తప్పించి అపరిచితులతో మాటామంతీ ఏమీ ఉండదు.

భలే బీర్ ఫెస్ట్...

ఇక్కడివారి ఆహారపుటలవాట్ల గురించి చెప్పాలంటే రకరకాల బ్రెడ్డులు, కేకుల తయారీలో నిష్ణాతులు వీరు. చీజ్‌లను బాగా ఇష్టపడతారు. బంగాళాదుంపలు బాగా పండిస్తారు, తింటారు. కాఫీ చాలా ఎక్కువగా తాగుతారు. ఇక్కడి ప్రత్యేకం అంటే బీఫ్, పోర్క్‌తో తయారుచేసే సాసేజ్‌లు. ఇంక బీర్ విషయానికొస్తే మంచినీళ్ల కన్నా బీర్ ఎక్కువ తాగుతారని అనొచ్చేమో. ఏటా సెప్టెంబర్ చివరి వారంలో మొదలై అక్టోబర్ మొదటి వారంలో ముగిసే బీర్ 'జాతర' ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 
http://www.wayfaring.info/wp-content/uploads/2007/06/beerfest.jpg
'అక్టోబర్ ఫెస్ట్' లేదా 'బీర్ ఫెస్'ట అని పిలిచే ఈ జాతర స్టివల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫోక్ ఫెస్టివల్ అంటారు. ఈ దేశంలో కొన్ని వందల ఏళ్ల నుండి బీరు తయారుచేస్తున్న బ్రూవరీస్ ఉన్నాయి. వాళ్లందరూ ఈ జాతరలో బీరు అమ్ముతారు. మిలియన్ల లీటర్లలోనే అమ్ముడుపోతుంది. ఈ బీర్ ఫెస్ట్ మొదలయ్యి పోయినేడాదికి 200 ఏళ్లు నిండాయట!

సాంకేతిక వ్యవసాయం...

ఇక్కడ బీరుకి ఉన్న ప్రాముఖ్యత తెలిసింది కాబట్టి బార్లీ పంట ఎంత ముఖ్యమైనదో ఊహించగలరు కదా! బార్లీ పంటలో వచ్చే ఒక ఫంగల్ వ్యాధి గురించిన పరిశోధనే మా ఇనిస్టిట్యూట్లో చేస్తుంటాం. ఈ దేశంలో వ్యవసాయం అంటే - బంగాళాదుంప, గోధుమ, బార్లీ, మొక్కజొన్న, రేప్‌సీడ్ పంటలే. టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడిన ఆర్థికవ్యవస్థ వీరిది.

ధనవంతులు గ్రామాల్లో నివసిస్తారు..

ఇక్కడ రైతులు చాలా ధనవంతులట. ఎవరికైనా పొలాలు ఉన్నాయంటే, గ్రామాల్లో ఉంటున్నారంటే వాళ్లు బాగా డబ్బున్నవారని అర్థం.http://farm4.static.flickr.com/3088/2604455318_f1355f7e0d.jpg
వాతావరణం గురించి చెప్పాలంటే సంవత్సరంలో మూడొంతులు చలికాలమే ఇక్కడ. వణికించే చలి, కుప్పలుతెప్పలుగా మంచు, ఎప్పుడోకానీ కనపడని సూరీడు... ఇలా ఉంటుంది. వసంతం వస్తే మాత్రం రంగురంగుల చెట్లూ పువ్వులతో చాలా అందంగా ఉంటుంది. పచ్చదనం చాలా ఎక్కువ. అలంకరణ అంటే కూడా చాలా ఇష్టం, ఇల్లు కళాత్మకంగా తీర్చి దిద్దుకుంటారు. క్రిస్మస్, ఈస్టర్ వీళ్లు బాగా చేసుకునే పండగలు.http://frameculture.files.wordpress.com/2010/12/fcgermanybikeshop2.jpg
కార్లున్నా...సైకిలే వాడతారు....
నేనుంటున్న మ్యూనిక్ నగరం పశ్చిమ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన మొదటి పది మహా నగరాల్లో మ్యూనిక్ ఒకటి. నగరంలో కన్నా చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గ్రామాలలోనే ధనవంతులు నివసిస్తూ ఉంటారు. గ్రామాల్లో జీవించడమే విలాసవంతం ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం బస్సులు, ట్రెయిన్లు, లోకల్ ట్రెయిన్లు చాలానే ఉన్నా, కార్ల సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచంలోనే కార్లప్రియులు అత్యధికంగా మోజుపడే బీఎమ్‌డబ్ల్యూ కార్ల పుట్టిల్లు ఈ ఊరే. చిత్రం ఏమంటే అందరికీ కార్లున్నా సైకిళ్ల వినియోగం కూడా ఎక్కువే. డెబ్భైఎనభైయ్యేళ్ల బామ్మలు, తాతలు సైకిళ్ల మీద తిరుగుతుంటే ఆశ్చర్యంగానూ, సరదాగానూ అనిపిస్తుంది. మా ప్రొఫెసర్ కూడా ఎప్పుడో అవసరమైతే తప్ప మామూలుగా సైకిల్ మీదే వస్తారు.
Mandarin Oriental Hotel Munich Germany
Mandarin Oriental Hotel – Munich
మహిళలపై ప్రత్యేక శ్రద్ధ...
ఇక్కడ పెళ్లిళ్లు చాలా తక్కువ. అలాగని కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండవనుకుంటే పొరపాటే! కుటుంబ బంధాల కన్నా వ్యక్తి స్వేచ్ఛకి విలువ ఎక్కువ. చిన్నవయసు నుంచే పిల్లలకు నచ్చింది చేసుకునే స్వేచ్ఛనిస్తారు. ఉదాహరణకు రెండేళ్ల పిల్లాడిని రెస్టారెంట్‌కు తీసుకొస్తే వాడికి మెనూ చదివి వినిపించి వాడికేది కావాలంటే అదే కొనిస్తారు. పెళ్లి చర్చిలో చేసుకోవడంతో పాటు రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవడం తప్పనిసరి ఇక్కడ. పిల్లల్ని కనడానికి చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం లేకపోతే తండ్రి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
http://www.german-info.com/images/german_images/Munich-women-large.jpg
Munich rated best city in Germany for women
 
పిల్లలు తల్లి ఇంటి పేరునో, తండ్రి ఇంటి పేరునో వారసత్వంగా తీసుకోవచ్చు. అయినప్పటికీ ఎక్కువశాతం తండ్రి ఇంటి పేరే తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ పిల్లల జనన రేటు చాలా తక్కువగనక పిల్లల్ని కనేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. పిల్లలు ఉన్నవారికి పన్నులు తగ్గుతాయి. అలాగే, ప్రతీనెలా కొంత ఎక్స్‌ట్రా జీతం కూడా అందుతుంది. అంతేకాదు ఇక్కడ యూనివర్సిటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కృషి చేసే విభాగం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగస్తులని ఎక్కువగా రిక్రూట్ చేస్కోవడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది ప్రభుత్వం.

కిండర్ గార్డెన్‌లో పిల్లలను చేర్పిస్తే తల్లిదండ్రులు కూడా వారానికి కొన్ని గంటలు వారితో గడపాలనేది రూల్. ఆడుతూపాడుతూనే బోలెడు విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. బురదలో, మంచులో, వానలో ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ కనిపిస్తారు వాళ్లు. మా ఆఫీస్ పక్కనే ఉండే కిండర్ గార్డెన్‌లో పిల్లలను గమనించడం చాలా సరదాగా ఉంటుంది నాకు. మా కొలీగ్ వాళ్ల పిల్లలు అక్కడ ఉన్నప్పుడు తను ఒకరోజు వాళ్లకోసం ఏదైనా ఇండియన్ వంటకం వండి పెట్టమని అడిగింది. నేనూ మరో ఇద్దరు స్నేహితులూ వెళ్లి పాయసం, పులిహోర చేసి పెట్టాము. వాళ్లకి గ్లోబు చూపిస్తూ ఒక్కో వారం ఒక్కో దేశం గురించి కొద్దికొద్దిగా నేర్పిస్తూ ఇండియా వంతు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచారన్నమాట. అదొక సరదా జ్ఞాపకం నాకు.

మ్యానిక్‌లో దీపావళి...

మ్యూనిక్‌లో తెలుగువారు బానే ఉన్నారుగానీ, ప్రత్యేకంగా సంఘంలాంటిది ఏమీ లేదు. తెలుగువారిలో విద్యార్థుల కన్నా ఉద్యోగస్తులు, ఇంజనీర్లు ఎక్కువ. బంగ్లాదేశీ, పాకిస్తానీ.. ఇలా ఆసియా దేశాలవారు నడుపుతున్న దుకాణాలున్నాయి. అక్కడ బియ్యం, కూరగాయలు, మసాలాలు ఇవన్నీ లభిస్తాయి. అలాగే ఇండియన్ రెస్టారెంట్లు కూడా బానే ఉంటాయి. కాకపోతే వాటిలో ఉత్తరాది వంటకాలే ఎక్కువ.

మ్యూనిక్‌లో ఇస్కాన్‌వాళ్ల కృష్ణుడి గుడి ఉంది. అక్కడికి భారతీయులతో పాటు స్థానిక జర్మన్లు కూడా వస్తూ ఉంటారు. వాళ్లలో దాదాపు హిందూమతం తీసుకున్నట్టు మారిపోయి కృష్ణప్రేమలో మునిగితేలే వారు చాలామందే కనిపిస్తారు. ప్రతి ఆదివారం పూజ తర్వాత అన్నసంతర్పణ జరుగుతుంది. ఈ కోవెల వాళ్లు ప్రతి ఏడూ జగన్నాథ రథయాత్ర చేస్తూ దేవుడి ఊరేగింపు ఉత్సవాన్ని మ్యూనిక్ వీధుల్లో చాలా ఘనంగా చేస్తారు. భగవ ద్గీతతో పాటు భారతీయ తత్వాన్ని తెలియజేసే పుస్తకాలను అమ్ముతారు, రకరకాల ప్రసాదాలను చేసి వీధుల్లో అందరికీ పంచిపెడతారు. రెండేళ్ల క్రితం యాత్రలో నేనూ పాల్గొన్నాను. మన సంప్రదాయ భరతనాట్యం నేర్చుకుని అందులో ప్రదర్శన ఇచ్చిన జర్మన్ యువతులను చూసి చాలా ముచ్చటేసింది. తెలుగువాళ్లంతా కలిసి దీపావళి బాగా చేసుకుంటారు.

ఇక్కడ సంతంటే ఎంతో ఇష్టం...

నాకు బాగా ఇష్టమయిన విషయం మరోటి చెప్పాలి. ఇక్కడ వారానికి రెండుసార్లు సంత జరుగుతూ ఉంటుంది. అప్పుడే పొలాల నుంచి తీసుకొచ్చిన తాజా కూరగాయలూ, పండ్లూ, రకరకాల చీజ్‌లు, పువ్వులు, పూలమొక్కలు... ఇవన్నీ అమ్ముతారు. మామూలు సూపర్‌మార్కెట్లలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరింత తాజాగా దొరుకుతాయి కాబట్టి. చాలామంది ఈ సంతల్లో అన్నీ కొనుక్కోవడానికే ఉత్సాహం చూపిస్తారు.
http://www.puvep.com/images/fruit-market.jpg
మరొకటి - నె లకో రెండు నెలలకో కొన్ని ప్రదేశాల్లో సెకెండ్ హ్యాండ్ వస్తువుల సంత జరుగుతుంది. అక్కడ వస్తువులన్నీ మహా చవక. వసంతమనీ, ఎండాకాలమనీ రకరకాల సమయాల్లో జాతరలు జరుగుతుంటాయి. వీళ్లకివి బాగా ఇష్టం. హస్తకళా నైపుణ్యంతో తయారు చేసిన రకరకాల వస్తువులు అమ్మే స్టాల్స్ విరివిగా కనపడతాయి ఇలాంటి సమయాల్లో.''

" ప్రపంచంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన మొదటి పది మహా నగరాల్లో మ్యూనిక్ ఒకటి. నగరంలో కన్నా చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గ్రామాలలోనే ధనవంతులు నివసిస్తూ ఉంటారు. గ్రామాల్లో జీవించడమే విలాసవంతం ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం బస్సులు, ట్రెయిన్లు, లోకల్ ట్రెయిన్లు చాలానే ఉన్నా, కార్ల సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచంలోనే కార్లప్రియులు అత్యధికంగా మోజుపడే బీఎమ్‌డబ్ల్యూ కార్ల పుట్టిల్లు ఈ ఊరే'' 
http://www.mrunification.com/germany-munich3.jpg

Monday, April 25, 2011

గుడాఫీ * లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ - ఒక తెలుగు వైద్యుడి స్వీయానుభవాలు

నియంత అంటే అంతా బ్యాడే కనిపిస్తుంది. కానీ గడాఫీని దగ్గరగా చూసిన వారికి అతడిలో బ్యాడ్ మాత్రమే కాదు, గుడ్ కూడా కనిపిస్తుంది. అందుకే అతడిని గుడాఫీ అని కూడా అనవచ్చేమో!

మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫారిన్ అసెస్‌మెంట్ వింగ్ ద్వారా లిబియాకు వెళ్లిన డాక్టర్స్ డెలిగేషన్‌లో ఇ.ఎన్.టి. స్పెషలిస్టుగా 1985 నుంచి పద్నాలుగేళ్లు, ప్రస్తుతం గడాఫీకి ఎదురు తిరిగి తిరుగుబాటు చేస్తున్న ప్రదేశాలలో ఒకటైన అల్‌మర్ నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో కొన్నాళ్లు పని చేశాను. నేను గొంతులో కాయల్తీసినవాళ్లు, చెవిలో కన్నాలు సరిచేయించుకున్న వ్యక్తులే కాక, ఎంతోమంది పరిచయస్తులు - నా లిబియన్ స్నేహితులు, ఇవ్వాళ రోడ్ల మీదకు వచ్చి తిరుగుబాటు చేస్తూ టీవీలో కనిపిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నా జీవితంలో ‘పీక్ పీరియడ్’ని ఆ దేశ ప్రజల సేవలో గడిపాను.http://quartetbooks.files.wordpress.com/2011/02/gaddafi_dw_politik__545028g.jpg
పద్నాలుగేళ్లంటే మాటలు కాదు, నన్ను హాఫ్ లిబియన్ అనొచ్చు. 1986 లో రెండు అమెరికన్ స్టెల్త్ బాంబర్లు అతి తక్కువ ఎత్తులో ఓ తెల్లవారుజామున మా ఇంటి మీది నుంచే ట్రిపోలీ వైపు వెళ్తుంటే, ఆ స్పీడ్‌కి మా ఇంటి కిటికీలు ఊగిపోవడం చూసిన ప్రత్యక్ష సాక్షిని. గడాఫీ ఏ రాత్రీ పడుకున్న చోట పడుకోడు. అతని ఇంటి మీద బాంబు వేసి వెళ్లిన అమెరికన్స్‌కది ‘ఫెయిల్యూర్ మిషన్’. గడాఫీకి ఏడుగురు డూప్‌లు ఉండేవాళ్లని పుకారు. ఆ నిజానిజాలు డూపులకే తెలియాలి. అరబిక్ భాష నాకు కొట్టిన పిండి కావడంతో ఆ ప్రజలకి తల్లో నాలుకనయ్యాను. రెండుసార్లు నేను గడాఫీని దగ్గర్నుంచి చూశాను. ఆయన స్పీచ్‌లు విన్నాను. ప్రొటోకాల్ ప్రకారంగా, ఆయన మా ఊరు వచ్చినప్పుడు అది నా డ్యూటీ కూడా. http://indepthafrica.com/wp-content/uploads/2011/03/Moammar-Gaddafi.jpg
నేను లిబియా వెళ్లిన కొత్తలో మా సీనియర్ ఇండియన్ డాక్టర్స్ నాక్కొంత హితబోధ చేశారు. ‘‘ఇది లిబియా అనబడు దేశము. ఇచ్చట ఫారినర్సందరూ ఫస్ట్‌క్లాస్ సిటిజన్స్. ఆ తర్వాతే లిబియన్స్. దానిక్కారణం వీళ్లకు సడెన్‌గా వచ్చిన గర్వాన్ని తొక్కిపెట్టే అధినేత. గాడిదల మీంచి తిన్నగా టయోటా కార్లలోకి దూకడంతో వచ్చిన తంటా ఇది. ఇది ముస్లిం కంట్రీ అయినా సర్వమత సామరస్యం ఉంది. ఆల్కహాల్ నిషిద్ధమే అయినా ఇంటి బాత్రూమ్‌లో బ్రువరీస్ పెట్టుకోవచ్చు. కావలిస్తే దానిక్కావలసిన ద్రాక్ష పళ్లన్నీ వీళ్లే మీ ఇంటికి ఫ్రీగా తెచ్చిస్తారు. ఇంత స్వాతంత్రం నీకు మరేదేశంలోనూ దొరకదు. కానీ ఒక ముఖ్యమైన వార్నింగ్. నీ వొకాబులరీలోంచి ‘గ’ అనే అక్షరంతో మొదలయ్యే ఏ భాషలోని ఏ పదాన్నైనా అర్జెంటుగా తొలగించెయ్. కల్లో కాదు, మనసులో కూడా అనుకోకు. ప్రామిస్ చెయ్’’ అన్నారు.
‘‘అమ్మ లిబియాయోయ్!’’ అనుకున్నాను.
http://www.breakingperceptions.com/wp-content/uploads/2010/04/muammar_al-gaddafi.jpg
* * *
సెప్టెంబర్ ఫస్ట్ ఆ దేశానికి ‘రివ ల్యూషనరీ డే’. మన ఆగస్టు పదిహేనునీ, వాళ్ల సెప్టెంబర్ ఫస్ట్‌నీ - ఇటు రాజీవ్ గాంధీని, అటు గడాఫీని లైన్ డ్రాయింగ్స్ వేసి, ఆ సిటీలో ఉన్న పది పదిహేను దేశాల వాళ్లందర్నీ ఇన్వాల్వ్ చేసి, పదిహేను రోజులు రిహార్సల్స్ చేయించి, ఓ రాత్రంతా మేరథాన్ ప్రోగ్రామ్ అర్గనైజ్ చేసి అదరగొట్టాననిపించుకున్నాను. ఇది గడాఫీకి తెలిసి, మా ముదీర్ (హాస్పిటల్ డెరైక్టర్) ద్వారా నాకు ప్రత్యేక శుభాకాంక్షలు పంపాడు. ఇది మీతో చెప్పుకోవద్దా. దటీజ్ గడాఫీ.
ఇక్కడి వరకూ నేనీ ఆర్టికల్ రాయడానికి గల అర్హతను మీ ముందుంచే ప్రయత్నం చేశాను.
- ఇక్కడ్నుంచే అసలు విషయం-


లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ తెలివైనవాడు. రాజును దింపి ‘రివల్యూషన్’ తెచ్చినవాడు. ఇప్పుడా రివల్యూషనరీనే దింపాలన్న రివల్యూషన్ అక్కడ మొదలైంది. దీనిలో పది పర్సెంట్ లిబియన్స్ ఐతే, తొంభై శాతం అల్‌ఖైదా వాళ్లేనంటాడు గడాఫీ. కావడానికి ముస్లిం కంట్రీయే అయినా లిబియాలో మతానికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. స్ర్తీలకు బురఖాల్లాంటి ఆంక్షలేమీ లేవు. ఇది అప్పట్లోనే, అంటే 1987 ప్రాంతాల్లోనే, ఇరాన్ లాంటి దేశాలకు నచ్చేది కాదు. అప్పుడు కొందరు గడ్డాలు పెంచుకున్న ముల్లాల్లాంటివాళ్లు విదేశాల నుంచి దొంగచాటుగా లిబియాలోకి వచ్చి, దేశంలోని అన్ని మసీదుల్లోనూ దాక్కుని, శుక్రవారం ప్రార్థనలకొచ్చిన లిబియన్లకి మత మౌఢ్యాన్ని బోధించసాగారు. కరపత్రాలు కూడా పంచారు. వార్త క్షణాల్లో తెలిసిపోయింది పెద్దాయనకి. అంతే. ఆర్మీ అన్ని మసీదుల్లోకి వెళ్లి అక్కడే ఆ గడ్డాల వాళ్లని కాల్చి పడేయడం, శవాల్ని బైటికీడ్చేయడం 1993 లోగా నాలుగైదుసార్లు జరిగింది. అలా జరిగినప్పుడంతా గడ్డాలున్న లిబియన్లందరూ క్లీన్ షేవ్‌తో తిరగాల్సొచ్చేది. గడ్డం పెంచితే షూట్ ఎట్ సైట్ ఆర్డరిచ్చిన గడాఫీ, తెలుగులో సార్థక నామధేయుడయ్యాడు ‘గడ్డాల్ని ఆపి’.http://arabia2day.com/wp-content/uploads/2011/03/83144936_Gaddafi_123035d.jpg
లిబియా విస్తీర్ణం చాలా ఎక్కువ. జనాభా తక్కువ. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ఎడారి ‘సహారా’ అక్కడే ఉంది. మరోవైపు బార్డరంతా మెడిటరేనియన్ సముద్రం. వాతావరణం గొప్పది. అక్కడ మూణ్ణెల్లు సమ్మర్. మన ఆంధ్రా వింటరంత ‘వేడి’గా ఉంటుంది. అక్కడ వాళ్లు సినిమాల్లో, టీవీల్లో ఫ్యాన్లు చూసి అవేంటని అడుగుతారు. ఎడారిలో మాత్రం పగలు యాభై, రాత్రి మైనస్ అయిదూ డిగ్రీలు ఉంటుంది. లిబియన్లు బైట ప్రపంచాన్ని ఈ మధ్యనే చూడ్డం నేర్చుకుంటున్నారు. ప్రపంచంలో కల్లా అతి గొప్ప డ్రైవర్స్ లిబియన్సే. కారైనా, విమానాలైనా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్సే కాక సేఫెస్ట్ కూడా. అదే వాళ్ల గొప్పతనం. ఫుట్‌బాల్ అంటే పిచ్చి. అదొక్కటే ఆడతారు. చూస్తారు. ఎక్కువమంది లిబియన్స్‌ని ‘అరబ్బీ మురబ్బాలు అనొచ్చు. వాళ్ల కోళ్లకు మూడు కాళ్లు. వాళ్ల మంచాలకి మూడే కోళ్లు. అందుకే పద్దెనిమిదేళ్లొచ్చిన ప్రతి మగాడూ కంపల్సరీ ఆర్మీ ట్రైనింగ్‌కి వెళ్లాలని రూలుందక్కడ.
http://static.guim.co.uk/sys-images/Guardian/About/General/2011/2/21/1298313339914/gaddafi-007.jpg
లిబియాలో ఫాన్లూ, ఏసీలు తప్ప అన్నీ దొరుకుతాయి. అన్నీ సబ్సిడైజ్డ్ రేట్లే. తిండి వస్తువులైతే మరీ చవక. గ్యాసూ, పెట్రోలు, ఆ మాటకొస్తే కార్లు కూడా కారు చౌక. ఉద్యోగం చేసినోళ్లకీ, చెయ్యని వాళ్లకీ కొంచెం తేడాతో నెలజీతాలిస్తారు. ఇక వాళ్లకేం తక్కువని ఈ రెవల్యూషన్? అనే ప్రశ్న తలెత్తకమానదు.

పదవిలో ఉన్న ఏ వ్యక్తికైనా కుర్చీ పోతుందేమోనని ఉండే భయంతో చేసే తప్పులే గడాీఫీ కూడా చేశాడు. జనాలకి ఆలోచించే టైమ్ ఇవ్వకుండా ఎప్పుడూ ఏదో ఓ టెన్షన్‌లో వాళ్లను ఉంచేవాడు. మూణ్ణెళ్లు మార్కెట్స్‌లో సబ్బులుండవు. ఏరియల్ వ్యూలోంచి చూడాలే గానీ, మనుషులంతా దిక్కుతోచని చీమల్లా సబ్బుల కోసం ఊర్లన్నీ తిరిగేస్తుంటారు. మరో యేడు, ఏవో మూడు నెలలు అగ్గిపెట్టెలు ఆపేస్తాడు. ఇంకో సంవత్సరం ఆర్నెల్లు సిగరెట్లు దొరకవు. అప్పుడు వాళ్లంతా రోడ్ల మీద తాగిపారేసిన సిగరెట్ పీకలు, ఫిల్టర్ ల కోసం రాత్రింబవళ్లూ వెదుక్కుంటూ ఉంటారు. సబ్బుల్లేకపోతే ఇటుక రుద్దుకుని, అగ్గిపెట్టెల స్థానే చెకుముకి రాళ్లు కొట్టుకుని దేశమంతా బతకడానికి అలవాటు చేశాడు. ఇదంతా వాళ్లని రాటుదేల్చాలనే సదుద్దేశంతో కాదు, బిజీగా ఉంచాలనేదే బిగ్‌బాస్ ఆలోచన. మట్టిలో చుట్టపీకలేరుకునేవాడు ఇక కుర్చీకేం ఎసరు పెట్టగలడు. అదీ అతని ఎత్తుగడ.


ఇంత తొక్కిపెట్టినా స్ప్రింగుల్లా తలెత్తిన కొందర్ని ఫుట్‌బాల్ స్టేడియంలో, పబ్లిక్‌ని బలవంతంగా లాఠీలతో ఆహ్వానించి, టీవీల్లో లైవ్ ఇస్తూ వారానికి నలుగురేసి చొప్పున బహిరంగ ఉరిశిక్షల్ని అమలు చేసేవాడు. లాకర్ బీ కేసులో ఫ్లైట్‌లో బాంబ్ పెట్టించి పేల్చేసి టెరర్రిస్ట్ కూడా అయ్యాడు.

http://topnews.in/healthcare/sites/default/files/Muammar-Gaddafi12.jpg
గడాఫీ చేసిన గొప్ప పనుల్లో ‘మాన్ మేడ్ రివర్’ ఒకటి. ఎడారిలో నది నిర్మించిన ఘనుడు. గొప్ప గొప్ప బిల్డింగులూ, అత్యంత నాణ్యమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు మొన్న బాంబుల దెబ్బకు కుప్పకూలాయి.
ప్రపంచంలోకే అత్యుత్తమ క్వాలిటీ పెట్రోలు లిబియాలోనే ఉంది. దాన్నెక్కువ ధరకు అమ్ముకోవడం తప్పేమీ కాదు. ఇక అమెరికన్ల వ్యవహారం చెప్పేదేముంది? పెట్రోలు ప్రేమికులు కదా. ఆ వాసనున్న దేశాల వైపు ఆకర్షితులౌతారన్నది విశ్వమెరిగిన సత్యం. గడాఫీకిది తెలుసు గనుకే - ముందు నుండి అమెరికా ద్వేషి. అమెరికన్లకు ఈ రివల్యూషన్ కలిసొచ్చింది. గడాఫీని దింపేసి తమకనుకూలమైన గవర్నమెంట్‌న క్కడ ఏర్పాటు చేసుకోవడమే అమెరికా లక్ష్యం. అందుకే భారత్ సహా మిగిలిన చాలా దేశాలీ అమెరికా జోక్యాన్ని సహించడం లేదు.

అసలీ రివల్యూషన్ ఏమిటి? పక్కనున్న ఈజిప్టులో జరిగింది కనుక ఇక్కడా జరగాలా? ఈ రెబల్స్ లీడరెవరు? గడాఫీ అడుగుతున్న ప్రశ్న ఇదే. ‘‘ఎవరికప్పజెప్పమంటారీ దేశాన్ని?’’ బి.బి.సి ఇంటర్వ్యూలో అతను అన్న మాటలు ఇవే.‘‘ఈ రెబల్స్ లిబియన్స్ కాదు. అల్‌ఖైదా ఇన్‌ఫిల్‌ట్రేటర్స్. వాళ్లు మావాళ్లని ఎగదోస్తున్నారంతే. లిబియన్ పీపుల్ దె ఆల్ లవ్ మీ’’ అంటూ ఘంటాపథంగా చెప్పాడు. ఆర్మీ మొత్తం తన చేతుల్లోనే ఉంది. విదేశీ జోక్యం లేకపోతే, ఇలాంటి రెవల్యూషన్స్‌ని అరగంటలో అణిచి పారేసే సత్తా ఉంది.

http://static.guim.co.uk/sys-images/Guardian/Pix/pictures/2011/2/20/1298233710636/Muammar-Gaddafi.-007.jpg
కానీ, దిగి వచ్చి, మెజారిటీ ప్రజలకేం కావాలో తెలుసుకుని తదనుగుణంగా నడుచుకుంటే దేశం సుభిక్షమే అవుతుంది. కానీ ఆ ఛాన్స్ అమెరికావాళ్లివ్వరు. లిబియన్లు డిక్టేటర్‌తో మొహంమొత్తి డెమోక్రసీ కావాలనుకుం టున్నారు. దానికాదేశం రెడీ అవ్వాలంటే ముందు కావలసింది అక్షరాస్యత.
గడాఫీ లేని లిబియా, అమెరికన్ క్రూక్‌లు చింపిన విస్తరే. తొందరలో మీరే చూస్తారుగా!

http://www.swen.ch/tl_files/swen/images/aktuell/Sept%2009/Gaddafi.jpg
  లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ తెలివైనవాడు.
రాజును దింపి ‘రివల్యూషన్’ తెచ్చినవాడు.
ఇప్పుడా రివల్యూషనరీనే దింపాలన్న రివల్యూషన్ అక్కడ మొదలైంది!!


‘‘ఎవరికప్పజెప్పమంటారీ దేశాన్ని?’’ అని
బి.బి.సి ఇంటర్వ్యూలో అడిగారు గడాఫీ.
ఈ రెబల్స్ లిబియన్స్ కాదు. అల్‌ఖైదా ఇన్‌ఫిల్‌ట్రేటర్స్ అంటారాయన.


 

Saturday, April 9, 2011

జీబ్రాన్..ఓ మహర్ణవం

ఏ కాలంలోనైనా కొత్త సత్యాలను అర్థం చేసుకోవడంలో లోకం ఎక్కువ సమయమే తీసుకుంటుంది. అందుకే కొత్త సత్యాలు చెప్పేవారికి లోకంలో అంత తొందరగా గుర్తింపు రాదు. చాలా సార్లు కొందరికి బతికినంత కాలమూ ఏ గుర్తింపూ రాకపోవచ్చు. అలా బతికి ఉన్నంత కాలమూ పెద్ద గుర్తింపే రాని వారిలో ఖలీల్ జిబ్రాన్ ఒకరు. నిజంగా జిబ్రాన్ చెప్పిన తాత్విక సత్యాలన్నీ పూర్తిగా వినూత్నమైనవి. వచనాన్ని కూడా కవితాత్మకంగా చెప్పే ఆయన శైలి మనసును కొత్త లోకాలకు తీసుకు వెళుతుంది. కవిగా, రచయితగా, చిత్రకారుడుగా, తత్వవేత్తగా అపారంగా కృషిచేసిన ఖలీల్ జిబ్రాన్ వర్థంతి ఏప్రెల్ 10న. ఆ సందర్భంగా ఈ వ్యాసం...
ఒక సామాన్య రైతు కుటుంబంలో, లెబనాన్‌లోని బషీరే గ్రామంలో 1888 జనవరి 6న జన్మించాడు ఖలీల్ జిబ్రాన్. 19వ శతాబ్దం చివరి వరకు లెబనాన్ ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా చాలా అధోగతిలోనే ఉంది. జీవనం దుర్భరమైపోయిన ఈ స్థితిలో ఎంతో మంది ప్రజలు విదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వలస వె ళ్లారు. అలా వెళ్లిన వారిలో జిబ్రాన్ కుటుంబం ఒకటి.

జిబ్రాన్‌కు చిన్నప్పటి నుంచీ చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. ఆ సంగతి తల్లి గమనించి అతన్ని ప్రోత్సహిస్తూ ఉండేది. అమెరికాలో జిబ్రాన్ ఎంతో శ్రద్దగా చదువుకునే వాడు. కానీ, స్వదేశాభిమానం వల్ల, జిబ్రాన్ తిరిగి లెబనాన్ వె ళ్లిపోయాడు. పట్టభద్రుడయ్యాక ఒక సాహిత్య, ఆధ్యాత్మిక పక్షపత్రికకు కొంత కాలం ఎడిటర్‌గా పనిచేశాడు. 1901లో చిత్రలేఖనం నేర్చుకునేందుకు పారిస్ వెళ్లి అక్కడ రెండేళ్లు ఉన్నాడు.

దేశ ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహరాలు, సంప్రదాయాలు, నియమాలు, ప్రభుత్వ శాసనాలు, చ ట్టాలన్నీ ఎంతో నిశితంగా పరిశీలించాడు. ప్రజల దైనందిన జీవితం ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుసుకున్నాడు. లోక వ్యవహారాలు, భౌతిక విషయాలు పైకి సుఖంగా, ప్రోత్సాహకరంగా కనిపించినా అవి చాలా మందిని క్రూరంగా అణచివేస్తున్న విషయాన్ని గమనించాడు. మొత్తం మీద ప్రజలు ప్రకృతి సౌందర్యాన్నీ అనుభవించకుండా, అర్థరహితమైన సత్యదూరమైన యాంత్రిక జీవితం గడుపుతున్నార న్న సంగతి తెలుసుకుని అతని హృదయం ద్రవించింది.

గరళం తాగుతున్న ప్రజ

"అంధులైన ఆ ప్రజల్ని చూసి జాలిపడ్డాను. భయంకరమైన క్రూరమృగాల పెదాలను వారు ఇష్టంతో ముద్దుపెట్టుకుంటున్నారు. విషనాగుల గరళం పీలుస్తున్నారు. తమ సమాధి గోతుల్ని తామే తవ్వుకుంటున్నారు'' అంటూ జిబ్రాన్ వాపోయాడు.

మూఢాచారాల్ని, మూఢనమ్మకాల్ని నిరాకరించాడు. మానవజాతి పురోభివృద్ధికి మూల పురుషుల మనుకున్న వారు నిజంగా అనర్హులని భావించాడు. అక్రమం, దుర్మార్గం అనేవి లేకుండా ప్రజలు, భారరహితంగా, పరిపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించాడు. ఎంతో ఆవేశంతో ఉద్రేకంతో మతపరమైన, సంఘపరమైన, ప్రభుత్వపరమైన పెద్దల్ని ఉద్దేశించి ఇంగ్లీషు, అరబిక్ భాషల్లో రచనలు చేయడం మొదలెట్టాడు. తన విశిష్టమైన మేధాసంపత్తితో మానవజాతిని జాగృతపరిచిన దార్శనికుడు జిబ్రాన్.

లెబనాన్ ప్రభుత్వ ప్రజా విద్రోహక చర్యలను ఖండిస్తూ 1903లో జిబ్రాన్ "స్పిరిట్స్ రెబెలియస్'' అనే ఒక పుస్తకం రాశాడు. ఆ గ్రం«థం లెబనాన్ దేశంలో ప్రజావిప్లవానికీ, తిరుగుబాటుకూ దారి తీస్తుందనే భయం పట్టుకుంది. శాంతి భద్రతలకు ఆ గ్రం«థం ప్రమాదకరమైనదని భావించి ఆ గ్రం«థ ప్రతులను బీరట్ అంగ డి వీధుల్లో తగుల బెట్టి జిబ్రాన్‌ను దేశం నుంచి బహిష్కరించింది ప్రభుత్వం. తిరుగుబాటులేని జీవితం వసంతం లేని రుతువుల్లా ఉంటుంది. "జీవితం, తిరుగుబాటు, ధర్మం'' ఈ మూడూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి'' అంటూ ప్రజల్లో విప్లవ భావాన్ని రేకెత్తించాడు. వాళ్లను అనేక విధాలా ఉత్సాహ పరుస్తూ, ఉత్తేజ పరుస్తూ అనేక రచనలు చేశాడు.

పరిపూర్ణ మార్గం... ప్రేమ

బీదవాడైన జిబ్రాన్ "మిస్ హేలా డాషర్ అనే ఒక ధనవంతుల అమ్మాయిని ప్రేమించాడు. లెబనాన్‌లో ధనవంతుల అమ్మాయిని పేదవాడు ప్రేమించడం నేరం. అమ్మాయి తల్లిదండ్రులు మరొక సంబంధం చూసి వివాహం చేశారు. అలా జిబ్రాన్ తొలి ప్రేమ భగ్నమైపోయింది. "ద బ్రోకెన్ వింగ్స్'' అనే తన గ్రం«థంలో తన ప్రియురాల్ని సెల్మా అనే పేరుతో చిరస్మరణీయం చేశాడు. అయితే ఆ గ్రం«థం యువతలో విషం నింపుతుందని, అది వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉందని, ఆ పుస్తకం విషం కలిపిన తేనెలాంటిదని విమర్శిస్తూ ఆ పుస్తకాన్ని తగల బెట్టమని కొందరు బహిరంగ ప్రకటనలు చేశారు. జిబ్రాన్ దీనికి జిబ్రాన్ "నా రచనల్లో తేనె కలుపుతున్నానని వారు అంటున్నారు నిజానికి నేను ఎక్కువ గా కలిపింది విషమే. అయితే వాళ్ల పొట్టలు దాన్ని జీర్ణించుకోలేవు'' అంటూ ఘాటుగా బదులిచ్చాడు.

జిబ్రాన్ వద్ద బొత్తిగా డబ్బులేని సమయంలో ఒక ధనవంతురాలు అతన్ని ఆదరించింది. అతని పెయింటింగ్స్‌కి మోడల్‌గా తోడ్పడింది. ఆ కాలంలోనే జిబ్రాన్ ఎన్నో పెయింటింగ్స్ వేశాడు. ఆ తరువాత అతడు ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్‌ను దర్శించిన మిస్ మేరీ హోస్కెల్ అనే ఆమె తన స్కూలు తరపున ఆ పెయింటింగ్స్ అన్నిటినీ కొనేసింది. అయితే మిస్ మేరీ హేస్కెల్ స్కూల్లో పనిచేసే ఒక టీచర్‌ను జిబ్రాన్ ప్రేమించాడు. కానీ, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో ఆమె అతనితో తన అనుబంధాన్ని తెంచేసుకుంది. అయతే హేస్కెల్‌చేసే అపారమైన ధనసహాయానికి కృతజ్ఞతగా ఏం చేయాలో తోచక జిబ్రాన్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. నిజానికి పెళ్లి చేసుకోవాలన్న బలమైన భావన అతనిలో లేదు.

అది గమనించిన హేస్కెల్ జిబ్రాన్‌తో వివాహ బంధానికీ అంగీకరించలేదు. ఆ సంఘటనతో జిబ్రాన్ జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ తరువాత చేసిన అతని రచనలన్నిటినీ హేస్కెల్ కే అంకితం ఇచ్చాడు. హేస్కెల్ వ్యవహారంతో జిబ్రాన్ మనసులోంచి వివాహ విషయం శాశ్వతంగా తొలగిపోయింది. ఆ తరువాత కూడా అతని జీవితంలోకి స్త్రీల ప్రవే శం ఆగలేదు. కానీ ఏ ఒక్కరినీ వివాహం చేసుకోలేదు. అప్పటికే "తనను తాను పరిపూర్ణం చేసుకోవడం తప్ప ప్రేమకు మరో ఉద్దేశం ఉండకూడదు'' అనేది నిశ్చితాభిప్రాయానికి జిబ్రాన్ వచ్చేశాడు.

అమెరికా వాసం

1908లో లెబనాన్ దేశానికి కొత్త ప్రభుత్వం వ చ్చింది. జిబ్రాన్ పై టర్కీ ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. అయితే 1912లో జిబ్రాన్ అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయాడు. ఆయన రచనలలో తల మానికమైనది 'ది ప్రాఫెట్ '(ప్రవక్త)గ్రం«థం 1923లో అచ్చయింది. ఈ కావ్యాన్ని ముందు అరబిక్ భాషలో రాసి ఆ తరువాత తానే ఇంగ్లీషులోకి అనువదించాడు.

ఆ తరువాత వచ్చిన 'వాయిస్ ఆఫ్ ది మాస్టర్ (మహార్ణవం)' అనే గ్రంథం కూడా ఒక గొప్ప కావ్యంగానే నిలబడింది. వాస్తవానికి ఆయన ప్రతి రచనల్లోనూ కొంగొత్త తాత్విక సత్యాలు కనిపిస్తాయి. ఒక ప్రాఫెట్ (ప్రవక్త) లోనే మనకు అమూల్యమైన ఎన్నో సత్యాలు కనిపిస్తాయి. వివిధ అంశాల మీద శిష్యుడు వేసే ప్రశ్నకు గురువు ఇచ్చే తాత్విక, కవితాత్మక సమాధానాలతో ఈ గ్రంథమంతా సాగుతుంది. వాటిలో కొన్ని...

ప్రేమ:
ప్రేమ మిమ్మల్ని పట్టాభిషిక్తుల్ని చేసినట్లే, అది మిమ్మల్ని శిలువ కూడా వేయిస్తుంది. అది మీ పురోభివృద్ధికి తోడ్పడుతున్నట్లే మిమ్మల్ని తెగటార్చడానికి అది సిద్ధమవుతుంది. పండిన ధాన్యం కంకుల్ని కోసి, కుప్పేసినట్లు, ప్రేమ మిమ్మల్ని తన దగ్గరకు తీసుకుంటుంది. ధాన్యాన్ని రాలగొట్టినట్లు, ప్రేమ మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది. మీ హృదయ ర హస్యాలు మీరు తెలుసుకునేందుకు ప్రేమ ఇవన్నీ చేస్తుంది.

సంతానం:
మీ పిల్లలు మీ పిల్లలు కారు. తన పరిపూర్ణత కోసం జీవితం పడే తపన ఫలితంగా ఆవిర్భవించిన వారే. పిల్లలు మీ ద్వారా ఆవిర్భవిస్తారే కానీ, మీ నుంచి కాదు. వారు మీతో ఉన్నా మీకు సంబంధించిన వారేమీ కాదు. మీ ప్రేమను వారికి ఇవ్వగలరేమో కానీ, మీ ఆలోచనలను వారికి ఇవ్వలేరు. జీవితం వెనక్కిపోదు. గతంవలో కలసి వెనుక దిగబడీపోదు. వారిని మీ వలె తయారు చేయాలని చూడకండి.
శ్రమ తత్వం:
సోమరిగా ఉండడం అంటే రుతువులకు అపరిచితులుగా ఉండడం. అనంతత్వం వైపు గంభీరంగా, గర్వంగా సాగిపోయే జీవిత ప్రస్తానం నుంచి వైదొలగడం. భూమితోనూ, దాని ఆత్మతోనూ మీరు సమంగా స్పందించడమే శ్రమించడం. శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం, నిగూఢమైన జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం.
ఆనందం:
దుఃఖం కన్నా ఆనందం గొప్పదని మీలో కొందరు అంటారు. కాదు, దుఃఖమే గొప్పదని మరికొందరు అంటారు. కానీ, ఆ రెండూ అభేద్యమైనవని నేనంటాను. ఆ రెండూ ఎప్పుడూ కలిసే వస్తాయి. ఒకటి మీ సహపంక్తి భోజనానికి కూర్చుంటే రెండవది మీ శయ్యపై నిద్రిస్తూ ఉంటుంది.
మృత్యువు :
చనిపోవడం అంటే గాలిలో నగ్నంగా నిలబడటం, సూర్యకాంతికి కరగడం. శ్వాస ఆగిపోవడం అంటే, విరామం లేని ఉచ్ఛ్వాస-నిశ్వాసలనుంచి శ్వాసను స్వేచ్ఛగా పరచడం, స్వేచ్ఛ పొందిన ఆ శ్వాస పైకెగసి విశ్వమంతా వ్యాపించడం.ప్రాఫెట్ గ్రంథంలోని ప్రతి అధ్యాయమూ ఇలాగే సాగుతుంది.
చివరిగా....

జిబ్రాన్ ఏకాంత వాసంలోనే సంపూర్ణ జీవితం ఉందని భావించాడు. ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఏకాంతమే సరియైన స్థితి అనుకున్నాడు. అందుకే తన చివరి సంవత్సరాలన్నీ ఎవరితోనూ , దేనితోనూ సంబంధం లేకుండా న్యూయార్క్ నగరంలో ఏకాంతంగా గడిపాడు.

ఆ స్థితిలో అతన్ని చూడ్డానికి ఎందరో మేధావులు-పండితులు, తత్త్వవేత్తలు వచ్చే వారు. అలాంటి వారిలో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. ఖలీల్ జిబ్రాన్ తన 48వ ఏట అంటే ఏప్రిల్ 10, 1931న తుది శ్వాస విడిచాదు. జిబ్రాన్ అంతిమ కోరిక మేరకు అభిమానులు అతని మృతదేహాన్ని లెబనాన్ తీసుకు వెళ్లి అతని స్వగ్రామంలో సమాధి చేశారు. ఆ గ్రామం క్రమంగా ఒక యాత్రా స్థలంగా మారింది. ఆయన ఉపయోగించిన వస్తువుల్ని రాసిన గ్రంథాల్ని, గీసిన చిత్రాల్ని ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఆయన్ని ఒక ప్రవక్తగా ఇప్పటికీ ఆరాధిస్తున్నారు
- బమ్మెర

Friday, April 8, 2011

అనంత సంచారి

'అంతము లేని ఈ భువనమంత పురాతన పాంథశాల' అన్న పద్య పాదం విన్నా, "సంచారమే ఎంతో బాగున్నది... దీనంత ఆనందమేమున్నది... ఇల్లు పొల్లూలేని, ముల్లె మూటా లేని....వెంబడించే వెర్రి జ్ఞాపకాలూ లేని ...సంచారమే ఎంతో బాగున్నది.. '' అంటూ గానం చేసిన ఒక జానపద కవి తత్వం విన్నా వెంటనే గుర్తుకొచ్చేది లోకసంచారి రాహుల్ సాంకృత్యాయన్. ఆయన రాసిన 'లోకసంచారి' ('ఘుమక్కడ్ శాస్త్ర)
 పుస్తకం లోక సంచార జీవన తత్వానికే ఒక ప్రామాణిక గ్రంధమయ్యింది. ఆ పుస్తకం దాదాపు ఆయన జీవితానికే ఒక నిలువుటద్దమై నిలిచింది.
జ్ఞాన సముపార్జనే జీవిత లక్ష్యం అయితే దానికి లోక సంచారిగా మారడమే శ్రేష్ఠం అన్నది రాహుల్ సాంకృత్యాయన్ స్థిరమైన అభిప్రాయం. ఈ విషయాన్నే చెబుతూ " ఆది మానవుడు నిఖార్సయిన లోక సంచారి. ఆకాశంలో పక్షులు విహరించేంత స్వేచ్ఛగా అతడు లోకంలో విహరిస్తూ ఉండేవాడు. ఇల్లూ, వాకిలీ, పొలము-పుట్రా ఈ బంధనాలేవీ ఉండేవి కావు అతడికి. ఈ రోజు ఇక్కడ ఉండే రేపు మరోచోట. ఆధునిక మానవుడు బావిలో కప్పలా మారిపోయాడు. గానుగెద్దులా జీవితమంతా ఒకేచోట పడి ఉంటున్నాడు. ఈ స్థిరజీవులు, ఈ గానుగెద్దులే ప్రపంచాన్ని ఉద్ధరించారనే భ్రమలో కొందరు ఉన్నారు. కానీ, జీవోత్పత్తి , పరిణామ శాస్త్రాల మీద అపారమైన పరిశోధనలు చేసిన డార్విన్ ఆ జన్మ లోక సంచారి అని ఎందరికి తెలుసు? అతడు అలా లోకసంచారి కాకపోతే ఆ పరిశోధనలు చేయగలిగే వాడా? అంటూ ఆయన ప్రశ్నిస్తాడు.

పుస్తకాలు నీడలు

"మానవుడు స్వయంగా లోక సంచారి కావలసిన పనిలేదు. గ్రంధాల ఆధారంగా ప్రాపంచిక జ్ఙానాన్ని పొందవచ్చు'' అంటారు, కొందరు. నిజానికి యాత్రా సాహిత్యం చదవడం వల్ల కలిగే జ్ఞానం చాలా స్వల్పమే. పుస్తకాలు నీడల్లాంటివి. హిమాలయ పర్వతాల ఫోటోలు చూసి ఎవరైనా హిమాలయాల సౌందర్యాన్నీ, చల్లదనాన్నీ అనుభూతి చెందగలరా? అంత మాత్రాన యాత్రాసాహిత్యం పూర్తిగా వ్యర్థం అని నేనను. అసలే లేకపోవడం కన్నా పుస్తకాల ద్వారా ఏదో కొంత పొందడం మేలే.

అయితే లోకసంచారులు రాసిన సాహిత్యం చదవడం వల్ల తనూ లోక సంచారి కావాలన్న ప్రేరణ అయినా పొందుతారనుకోవచ్చు'' అంటాడాయన. సంచార జీవనంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొత్తంగా చూస్తే లోకసంచారి జీవితం షడ్ర సోపేతంగా ఉంటుందంటాడు రాహుల్. యాత్రలు కఠినంగానే ఉన్నా, అపరిచిత దేశాల్ని చూడటంలోనూ లోకసంచారికి ఒక గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆధునిక ప్రపంచానికి దూరంగా, అపరిచిత ప్రదేశాల్లో ప్రత్యేకించి వెనుకబడిన సమూహాల్లోకి వెళ్లి వాళ్లతో ఉండి, వారి సుఖదుఃఖాల్నీ తెలుసుకుని లోకసంచారి సభ్య ప్రపంచానికి తెలియచేస్తారు.'' అంటాడు రాహుల్. ఆయన ప్రసిద్ధ రచన 'ఓల్గా నుంచి గంగ' లో ఒక చోట తాను సంచరించిన ఒక ప్రదేశాన్ని గురించి చెప్పిస్తాడు ఓ పాత్రతో.

"గ్రామాల్లో దారిద్య్రం ఉంది. కానీ, హృదయ విదారకమైన దృశ్యాలు అక్కడ తక్కువే కనపడతాయి. అక్కడ దాసదాసీ జనాల్ని అమ్మేసేటంత కనపడదు. వివస్త్రగా ఉన్న వారిని కొరడాలతో కొట్టే దృశ్యాలు కనపడవు. కాళిదాసు ఒక సందర్భంలో ఈ విషయమై మాట్లాడుతూ తమ పూర్వజన్మలో చేసిన కర్మఫలాలను అనుసరించే కొందరు దాసదాసీలుగా పుడతారు అంటాడు. ఏ రోజైతే నేనామాట ఆయన నోట విన్నానో ఆ రోజునుంచే నాకు పూర్వ జన్మ అంటే నమ్మకం లేకుండా పోయింది.'' అంటుంది. సాహిత్యం మాటున సాంకృత్యాయన్ ఇలా తన ఆగ్రహాన్ని, ఆక్రోశాన్నీ బయటపెడతాడు.

బుద్ధుడు లోకసంచారి

ప్రపంచంలోని మతాచార్యులందరూ లోకసంచారులే! మతాచార్యులందరిలోకి బుద్ధుడు సర్వశ్రేష్ఠుడు. బుద్ధికుశలతలోనూ, సహృదయతలోనూ బుద్ధుడే సర్వోన్నతుడు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మత ప్రవక్త ఆ జన్మ సంచారి. బుద్ధుడు ఇతర దేశాలకు వెళ్లలేదు కానీ, భారత దేశంలోనే నిరంతరం పర్యటించే వాడు. పైగా "బిక్షువుల్లారా పర్యటించండి'' అంటూ తన శిష్యులకు నిరంతరం చెప్పేవాడు.

భారతీయ మతాల్లో ఒకటైన జైన మత ప్రవక్త మహా వీరుడు. ఇతడూ ఆ జన్మ సంచారే. బుద్ధుడు, మహా వీరుడు మహాత్ములు కావడానికి లోక సంచారులు కావలసి వచ్చింది. ఒక చోట స్థిరంగా ఉంటూ ఓ పదేళ్లలో సంపాదించే జ్ఞాన విజ్ఞానాలను సంచారిగా ఉంటూ కేవలం రెండేళ్లలో సంపాదించవచ్చు. మానవుడు అనుసరించడానికి, ఆదరించడానికి లోక సంచారతత్వానికి మించిన మతం లేదు. ఏ జాతి అయినా అభివృద్ధికి రావడం అన్నది ఆ జాతిలోని లోక సంచారుల మీదే ఆధారపడి ఉంటుంది.'' అంటాడు సాంకృత్యాయన్.

జీవితం ఓ ప్రయాణం

రాహుల్ సాంకృత్యాయన్ రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గర్ జిల్లాలో ఏప్రిల్ 9, 1893న జన్మించాడు. ఆయన అసలు పేరు కేదార్ పాండే. బౌద్ధం మతంతో ప్రభావితమైన తరువాత తన పేరును రాహుల్ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నాడు. తన జీవిత కాలంలో సుమారు 45 ఏళ్ల పాటు ఆయన లోక సంచారంలోనే గడిపాడు. అద్వైత వాదం నుంచి మార్క్సిజం దాకా ఆన్ని తత్వాల మీదా గొప్ప సాధికారతను సాధించాడు. ఒక దశలో బౌద్ధ బిక్షువుగా మారిన సాంకృత్యాయన్ బుద్ధుడి పట్ల ఆపారమైన ఆరాధనతో ఉన్నాడు. స్వాతంత్య్ర సమర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రచనలు, ఉపన్యాసాల కారణంగా మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు.

ఆయనకున్న అపారమైన పాండిత్యానికి అతనికి మహాపండిత్ అన్న బిరుదును ప్రదానం చేశారు. 9వ ఏట రాహుల్ ప్రపంచాన్ని చూడాలన్న కాంక్షతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. పాఠశాలలో ప్రాధమిక విద్య మాత్రమే అభ్యసించాడు. కానీ, ఆ తరువాత స్వయం కృషితో సుమారు 30 భాషల్లో పాండిత్యాన్ని సాధించాడు. లెనింగ్రాడ్ యూనివర్సిటీలో కొంత కాలం ఇండాలజీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు. ఆయన రాసిన ఓల్గా నుంచి గంగకు , లోకసంచారి, విస్మృత యాత్రికుడు, ప్రాక్పశ్చిమ దర్శనాలు వంటి రచనలు ఆయనకు ఆపారమైన పేరు పఖ్యాతులు తెచ్చిపెట్టాయి. లోకసంచారిగా ఆయన శ్రీలంక, జపాన్ కొరియా, చైనా, రష్యా వంటి పలు దేశాలకు కాలినడకన వెళ్లాడు.

జీవితాన్ని జీవించాలి

లోక సంచారికి వివాహం ఒక పెద్ద అడ్డుగోడ అని నమ్మే సాంకృత్యాయన్ ఒక చిన్న సడలింపు కూడా చెబుతాడు. తన సంచారానికి భంగం కలగకుండా ఉంటే స్త్రీలోక సంచారిని జీవన సహచరిగా స్వీకరించవచ్చునంటాడు. అందుకేనేమో బాగా చిన్న వయసులోనే అతడు పెళ్లయ్యింది. ఆ బంధమేమీ కొనసాగలేదు. సోవియట్ రష్యాలో ఉంటున్న కాలంలో మంగోలియన్ స్కాలర్‌తో తన అనుబం«ధాన్ని కొనసాగించాడు. రష్యా నుంచి ఇండియాకు వ చ్చేశాక ఇండియన్ నేపాలీని పెళ్లి చేసుకున్నాడు.

ఆ తరువాత శ్రీలంక యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా వెళ్లిన రాహుల్ కొన్నాళ్లలోనే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. చివరికి డార్జిలింగ్‌లో ఏప్రిల్ 14,1963న తన తుది శ్వాస విడిచాడు. ఒక మనిషి తన జీవిత కాలంలో ఏమేం చేయగలడు? అన్న ప్రశ్నకు చేవ ఉన్నవాడు లోకాన్ని సమగ్రంగా అధ్యయనం చేయగలవాడు ఎన్నయినా చేయగలడు అన్న సమాధానం రాహుల్ సాంకృత్యాయన్ జీవితాన్ని చూస్తే బోధపడుతుంది.