విద్యార్థుల మేథోసామర్థ్యాన్ని, తార్కిక పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు మ్యాడ్ర్యాట్ గేమ్స్ టానిక్లా పనిచేస్తాయి. అచ్చు చెస్ బోర్డు ఉన్నట్లే ఉంటుంది మ్యాడ్ర్యాట్ కంపెనీ తయారు చేసిన హిందీ గేమ్ 'అక్షరిత్'. ఇందులో అక్షరాలు, కొన్ని ఖాళీ గళ్లు ఉంటాయి. హిందీ అక్షరాలు తెలిసిన ఎవరైనా ఈ గేమ్ను సులువుగా ఆడవచ్చు. పిల్లలు రెగ్యులర్గా ఆడితే భాషలో గట్టి పట్టు దొరుకుతుంది. పిల్లలకైతే సులువుగా, పెద్దలకైతే కొంచెం క్లిష్టంగా ఉండేలా విడివిడిగా గేమ్స్ను తయారుచేశారు. మధ్యప్రదేశ్లో 200 పాఠశాలలు, పశ్చిమబెంగాల్లో 100, రాజస్థాన్లో 75 పాఠశాలలు ఈ గేమ్స్ను తెప్పించుకోవడం విశేషం.
ఐడియా ఎలా వచ్చింది..?
ఐ.ఐ.టి. పూర్తి చేసిన మనుజ్ ఒకసారి రైల్లో దూర ప్రయాణం చేస్తున్నాడు. అదేదో గంటా రెండుగంటలు ప్రయాణం కాదు. ఏకంగా 55 గంటల ప్రయాణం. టీ తాగాడు. పేపర్లు తిరగేశాడు. పాటలు విన్నాడు. వేరుశెనక్కాయలు తింటూ టైమ్పాస్ చేశాడు. అయినా విసుగు. దిక్కుతోచలేదు. 'నేనే కాదు. రోజూ నాలాగే రైళ్లలో లాంగ్ జర్నీ చేసే వాళ్లందరికీ ఇదే బోర్. ఈ బోర్ను బద్దలు చేసే 'ఫన్'టాస్టిక్ ఐడియా ఏదన్నా ఉంటుందా..?' అంటూ తెగ ఆలోచిస్తే.. అప్పుడు వెలిగింది 'బోర్డ్గేమ్'. 'హిందీలో ఇంతవరకు చిన్నాచితక గేమ్స్ వచ్చాయి కానీ, కేవలం అక్షరాలతో మ్యాజిక్ చేసే గేమ్ రాలేదు. ఎలాగైనా భాషతో ఆడుకునే ఆటను కనిపెట్టాలి..' అనుకున్నాడు.
ఇంటికి వచ్చీ రావడంతోనే సోదరుడు రజత్తో షేర్ చేసుకున్నాడు మనుజ్. "అరే భాయ్, హిందీతో గేమ్ తయారు చేయడం అంటే ఆటలా..? హిందీ అక్షరాల రూపం ఎలా ఉంటుందో తెలుసుకదా..? ఆంగ్లంలో 26 అక్షరాలే ఉంటాయి. హిందీలో 600 ధ్వనులున్నాయి. హాఫ్ లెటర్స్, కాంపౌండ్ లెటర్స్, మాత్రాస్.. వీటన్నిటినీ కలుపుకుంటే గేమ్ కోసం 4 వేల టైల్స్ చేయాలి. ఈ టైల్స్ పట్టే బోర్డ్ సైజ్ ఎంతుండాలో తెలుసా..? మన బెడ్రూంలో ఉన్న డబుల్ బెడ్ అంత..'' అన్నాడు నవ్వుకుంటూ. రజత్ నోటికి ఏది వస్తే అది చెప్పేరకం కాదు. అతని మాటంటే మనుజ్కు గురి.
ఎందుకంటే, రజత్ పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసింది అమెరికాలోని కార్నెగీ మిలాన్ యూనివర్శిటీలో. అప్పటికైతే సైలెంట్గా ఉండిపోయిన మనుజ్.. కొన్నాళ్ల తర్వాత ఇదే ఐడియాను తన భార్య మధుమితతో చెప్పాడు. ఈ భార్యాభర్తలిద్దరూ ఒకప్పుడు మదనపల్లి దగ్గరున్న 'రిషివ్యాలీ'లో టీచర్లు. ఇద్దరిదీ ఒకే బోధనానుభవం కావడంతో 'ఈ ఐడియా బావుంది. ప్రాక్టికల్గా వర్కవుట్ అవుతుందో లేదో స్టడీ చేయాలి..' అంది మధుమిత.
ముగ్గురూ కలిసి పలువురు భాషాశాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కలిసి అభిప్రాయాలను తెలుసుకున్నారు. "బోర్డ్గేమ్స్ వస్తే ఆసక్తిగా ఆడతారా, కొన్నాళ్లకు మానేస్తారా..? తెలుసుకునేందుకు మారూమూల పల్లెల్లో సైతం తిరిగాం..'' అన్నారు మనుజ్, మధుమిత. వీళ్ల ఐడియాను పొగిడిన వాళ్లు ఉన్నట్లే, తెగిడిన వాళ్లూ ఉన్నారు. ఏదైతే అది అవుతుందని 'ఆట' మొదలుపెట్టారు. గేమ్బోర్డును డిజైన్ చేసేందుకు ఇటలీ వెళ్లి అక్కడ పేరున్న గేమ్ డిజైనర్ను కలిశారు ఈ ముగ్గురూ.
కలర్ఫుల్గా పిల్లలు చూస్తూనే ఆకట్టుకునేలా బోర్డ్ను తీర్చిదిద్దారు. మార్కెట్లోకి వస్తూనే ఈ గేమ్ అందర్నీ కట్టిపడేసింది. చాలామంది ఎగబడి కొన్నారు. పాఠశాలల యాజమాన్యాల వారు ఫోన్లు చేసి తెప్పించుకున్నారు. పలు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు అధికారికంగా కొనుగోలు చేశారు. ఇప్పుడు కొన్ని నోకియా మొబైల్ ఫోన్లలో కూడా మ్యాడ్ర్యాట్ గేమ్స్ చేరిపోయాయి. కొత్త ఆలోచన పండితే తీయటి ఫలితాలు వాటంతట అవే వస్తాయనేందుకు ఈ 'త్రీ ఐడియట్స్' నిదర్శనం. ఏమంటారు..? మరింత 'మ్యాడ్ర్యాట్ ' సమాచారం కోసం : http://www.aksharit.com
No comments:
Post a Comment