వచ్చింది అడవిగుండా బీటికి, బీటిగుండా ఏటి ఒడ్డుకు, బల్లకట్టు రేవు పక్కగా మర్రిచెట్టు నీడకు. పిమ్మట, ఆ వైపు పడిపోయిన రేవునుండి వంకర తిరిగి వెళ్లిపోయింది ఊరిలోనికి. ఆ మీద పంటచేల అంచుగా, మామిడితోపు నీడలనుండి, తామరకొలను గట్టుమీదుగా, తేరువుండే చోటికి ఓరగా, మరి ఏ ఊరికి వెళ్లి చేరిపోయిందో తెలియదు.
ఈ బాటమీద ఎందరెందరు జనులు; కొందరేమో నా ప్రక్కనే వెళ్లిపోయారు. కొందరు కూడా తోడు నడిచారు. కొందరు దూరాననే కనబడ్డారు.
కొందరి తలలపై మేలి ముసుగులు. కొందరికి లేవు. కొందరు కడవలతో నీళ్లు తెచ్చుటకు వెళ్లుతున్నారు. కొందరు నీళ్లు తెచ్చుకుని తిరిగి వస్తున్నారు.
*
ఇప్పుడు పగలు గడిచిపోయింది. చీకటి దట్టమై ముసురుతోంది.
ఒకప్పుడు అనుకొన్నాను, "ఈ బాట నాదే, నా ఒక్కడిది మాత్రమే'' అని. ఇప్పుడు చూస్తే, "ఒక్కసారి మాత్రమే ఈ బాట వెంట నేను వెళ్లుటకు అనుమతి తీసుకొచ్చాను; మరి ఇక లేదు'' అని అనిపిస్తున్నది. నిమ్మపాదు దాటి, ఆ మడుగు గట్టు దాటి, పాడుబడ్డ దేవళాలరేవు, ఏటి మెరక, గొల్లవాని గుడిసె దాటి, వడ్లకుప్పలు దాటి, ఇదివరకు నేనెరిగిన చూపులకోసము, పరిచితములైన పలుకుల కొరకు, తెలిసిన ముఖాల మేడలకై, ఇంకొకసారి తిరిగివెళ్లి, "ఇదో వచ్చాను'' అని అనుటకు వీలు లేదు కాబోలు.
ఈ త్రోవ వెడలిపోయే త్రోవే గాని, తిరిగివచ్చేది కాదు.
ఈ గోధూళివేళ, ఒకసారి వెనుకకు తిరిగిచూచి అనుకుంటున్నాను. "మరచిపోయిన పెక్కు కాలిజాడలతో కూర్చిన కీర్తన ఈ త్రోవ; భైరవ రాగములో కట్టబడింది.''
ఎప్పటినుండో, ఎంతోమంది బాటసారులు వెడలిపోయారు. వారి జీవిత విషయాలు సమస్తమూ ఈ బాట ఒకే ధూళి పంక్తియందు ఇముడ్చుకుని వ్రాసుకొన్నది. ఆ ఒక్క పంక్తీ, ప్రొద్దుపొడిచే దిక్కునుండి ప్రొద్దుక్రుంకే ఒక బంగారు సింహద్వారము నుండి బయలుదేరి మరొక బంగారు సింహద్వారములోనికి వెడుతోంది.
*
"ఓ కాలిబాటా; అనేక కాలాల అనేక సంగతులను నీ ధూళి బంధనాల్లో కట్టివేసికొని, ఏమీ తెలియనిదానివలె దాచి ఉంచుకోవద్దు. నేను నీ ధూళిలో చెవియొగ్గి విం టున్నా; రవంత గుసగుసలతో అంతా నాకు చెప్పి వెయ్యి.''
రేయి నల్ల పర్దా వైపు చూపుడువేలు చాపి మాట్లాడకుండా ఉండిపోయింది బాట.
"ఓ కాలిబాటా, ఎందరివో బాటసారులవి, ఎన్నో తలపులు, ఎన్నో కోరికలు, అన్నీ ఎచ్చటికి వెళ్లాయి?''
మూగ బాట మాటలాడదు; తూర్పునుండి పడమటికి మాత్రము సైగలు చేస్తున్నది.
"ఓ కాలిబాటా, నీ గుండెపై లెక్కలేని కాలి అడుగులు ఒకప్పుడు పూల వానవలె పడ్డవే. అవన్నీ నేడు ఎచ్చటా లేవా?'' తన తుది ఎచ్చటో బాటకు తెలుసునా? పోగొట్టుకొన్న పూలు, చప్పుడులేని పాటలు ఎచటికి చేరిపోయాయో, చుక్కల వెలుగుల్లో ఎచ్చట ఆర్పరాని వగపుల దీపావళి పండుగలయ్యాయో?
***
విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ 1919లో రాసిన ఒక భావ చిత్రం. 'లిపిక' పేరుతో రాసిన ఈ స్కెచ్లను బెజవాడ గోపాలరెడ్డి 'వానచినుకులు' పేరుతో 1952లో అనువదించారు. దాటి వచ్చిన కాలానికి, జీవితానికి ప్రతీకగా ఎంత గొప్ప తలపోత.
No comments:
Post a Comment